శ్రీ మహా విష్ణువు:బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు త్రిమూర్తులు.అందు సృష్టికి బ్రహ్మయు,స్థితికి విష్ణువు,లయమునకు హరుడును అధిపతులు.ఈ మూడింటి స్థితియు శాశ్వము కనుక మరల విష్ణువే స్థితి కధిపతియై,సృష్టిలయములకన్న ప్రాధాన్యము వహించు చున్నాడు.స్థితి లేనిది లయము లేదు.లయము లేనిది మరల సృష్టిలేదు.సృష్టి,స్థితి,లయములు మూడునూ కలుగు చుండుటయే శాశ్వతమైన స్థితి.దానికి విష్ణు వధిపతి.దీనిని బట్టి సృష్టి స్థితి లయములలోని స్థితి యొకటియు,నీ మూడింటి స్థితి యొకటియు వేరుగా నున్నవని తెలియుచున్నది.అందు మూడింటిలో నొకటియైన స్థితి కధిపతి త్రిమూర్తులలోని విష్ణువు.ఈ మూడింటి యస్తిత్వమైన స్థితి కధిపతి త్రిమూర్తుల కతీతుడైన విష్ణువు.ఇతనినే మహా విష్ణువనియు,పరబ్రహ్మ మనియు,పరమాత్మ యనియు,సదాశివుడనియు వ్యవహరింతురు.భాగవత మందలి విష్ణువనగా శ్రీ మహా విష్ణువే గానీ,త్రిమూర్తులలోని విష్ణువు కాదు.విష్ణువను శబ్దముమునకు సర్వవ్యాపి యనియే అర్థము.భాగవతమున,విష్ణు పురాణమున, విష్ణు సహస్ర నామముల యందు ప్రతిపాదింపబడిన విష్ణు వితడే.వేదములయందు,విష్ణు సూక్తములలోను,అగ్ని స్తుతులలోను ప్రతిపాదింపబడిన దైవము కూడా నితడే.దీనిని గ్రహించిన వారికి విష్ణు ప్రతిపాదికములైన గ్రంథములయందు విష్ణువునకు, శివ ప్రతిపాదికములైన గ్రంథముల యందు సదాశివునకు,వేదాంతమందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమునకును భేదము లేదని తెలియును.దీనిని గ్రహింపలేని నాడు త్రిమూర్తులలో విష్ణువు గొప్పవాడని వైష్ణువులును,శివుడు గొప్పవాడని శైవులును, వారిని మించినవాడు పరబ్రహ్మమని వేదాంతులును వాదించుకొనుచుందురు.(Master E.K.గారి భాగవత రహస్య ప్రకాశము నుండి).
No comments:
Post a Comment